Funky movie: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ దాదాపు ఏడాది విరామం తర్వాత ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు అనుదీప్ కేవీ మార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక మాత్రం భిన్నమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ కథకు విశ్వక్ సేన్ మొదటి ఛాయిస్ కాదట. దర్శకుడు అనుదీప్ తొలుత ఈ సరదా కథను పాన్ ఇండియా స్టార్ తేజ సజ్జకు వినిపించారట. ఆ సమయంలో తేజ తన భారీ ప్రాజెక్ట్ ‘మిరాయ్’ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల, డేట్స్ సర్దుబాటు కాక ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తేజ నో చెప్పడంతో ఈ స్క్రిప్ట్ విశ్వక్ సేన్ వద్దకు వెళ్ళింది. కథలోని వినోదం నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయం బయటకు రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వరుసగా భారీ చిత్రాలు చేస్తున్న తేజ ఈ సినిమాను రిజెక్ట్ చేసి సేఫ్ అయ్యారని కొందరు అభిప్రాయపడుతుంటే, విశ్వక్ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారని మరికొందరు అంటున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అనుదీప్ వన్ లైనర్ కామెడీ కొన్ని చోట్ల నవ్వించినా, ఓవరాల్గా ‘జాతి రత్నాలు’ స్థాయి మ్యాజిక్ రిపీట్ కాలేదనే టాక్ వచ్చింది. ఈ సినిమా రివ్యూలపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. “మేమేమీ ‘సాగర సంగమం’ లాంటి క్లాసిక్ తీశామని చెప్పలేదు, కేవలం ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నం ఇది” అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించగా.. ఈశ్వరి రావు, వీటీవీ గణేష్, నరేష్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించారు. విశ్వక్ తన నటనతో సినిమాను భుజాలపై మోసినప్పటికీ, బలహీనమైన కథనం వల్ల అది సక్సెస్ వైపు తీసుకెళ్లలేకపోయింది. మొత్తానికి ‘ఫంకీ’ ఫలితం ఎలా ఉన్నా, విశ్వక్ సేన్ తన తదుపరి సినిమాలతో మళ్ళీ పుంజుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.