Is director chandu mondeti new film stoped: టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి కెరీర్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. ‘తండేల్’ చిత్రంతో నాగచైతన్యకు వంద కోట్ల క్లబ్ మెంబర్షిప్ ఇచ్చి, పాన్ ఇండియా దర్శకుడిగా తన ముద్ర వేసిన చందూ.. తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ‘తండేల్’ తర్వాత చందూ మొండేటి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘వాయుపుత్ర’ అనే భారీ యానిమేషన్ చిత్రాన్ని ప్రకటించారు. దసరా కానుకగా ఈ సినిమా వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, దీనిపై ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లు ఇండస్ట్రీ టాక్. చందూ తన తదుపరి సినిమాను ఒక బడా స్టార్తో చేయాలని గట్టిగానే ప్రయత్నించారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసినా, అది పట్టాలెక్కలేదు. కోలీవుడ్ స్టార్ సూర్యకు కూడా ఒక అద్భుతమైన కథ వినిపించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల నాగార్జున కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది కూడా సెట్ కాలేదని సమాచారం. హీరోల కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, తన మార్క్ సక్సెస్ ఫ్రాంచైజీని నమ్ముకోవడమే ఉత్తమమని చందూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు ‘కార్తికేయ 3’ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా పార్ట్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను సాధించింది. హీరో నిఖిల్ ప్రస్తుతం తన పీరియాడిక్ డ్రామా ‘స్వయంభు’ షూటింగ్, రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదలైన వెంటనే, ‘కార్తికేయ 3’ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.