Star heroine gave review on dhurandhar 2:బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీపై తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్ భార్య, నటి యామీ గౌతమ్ ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్, తన భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2’ గురించి గర్వంగా మాట్లాడారు. ఈ సినిమాను తాను ఇప్పటికే చూశానని చెబుతూ, అదొక అసాధారణమైన అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
“సినిమా చూసిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యాను.
ఆ వెంటనే నేను ఫ్లైట్ ఎక్కాల్సి రావడంతో ఆదిత్యతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. కానీ విమాన ప్రయాణం పొడవునా నా మనసులో సినిమా దృశ్యాలే మెదులుతున్నాయి. విమానం దిగాక ఆదిత్యకు నా అభిప్రాయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉండే ఒక అద్భుతం” అని యామీ ప్రశంసల వర్షం కురిపించారు. తొలి భాగం ‘ధురంధర్’ విజయం గురించి మాట్లాడుతూ.. తాను ‘ఆర్టికల్ 370’ షూటింగ్లో ఉన్నప్పుడే ఆదిత్య తనకు ఈ కథ వినిపించారని ఆమె గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో ఆయన కేవలం 40 పేజీల స్క్రిప్ట్ మాత్రమే ఇచ్చారు. కానీ అది చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడే ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు రాబోతున్న రెండో భాగం అంతకు మించి ఉండబోతోంది” అని యామీ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. దేశభక్తి, యాక్షన్ కలగలిసిన ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19న థియేటర్లలోకి రానుంది. రణ్వీర్ సింగ్ తన మార్క్ పర్ఫార్మెన్స్తో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.