Vijay- Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నప్పటికీ, ఇప్పుడు నేరుగా పెళ్లి ముహూర్తం ఖరారైందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని చారిత్రాత్మక ఉదయపూర్ ప్యాలెస్లో వైభవంగా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనే వీరి నిశ్చితార్థం అత్యంత గోప్యంగా జరిగిందని, ఆ ఫోటోలు బయటకు రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారని వినికిడి.
పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి విజయ్ దేవరకొండ స్వయంగా రాజస్థాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ ఏమిటంటే.. విజయ్ దేవరకొండ తన వివాహ ఆహ్వాన పత్రికల పంపిణీని ఇప్పటికే ప్రారంభించారట. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి, తన పెళ్లికి రావాల్సిందిగా విజయ్ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంకు ఆహ్వానం పంపడంతోనే పెళ్లి వార్తలు నిజమేనని అభిమానులు ఒక అంచనాకు వస్తున్నారు.
మరోవైపు సెలబ్రిటీల వివాహ వేడుకల వీడియో హక్కులను కొనుగోలు చేయడం ఇప్పుడు ఓటీటీ సంస్థలకు ట్రెండ్గా మారింది. ఈ నేపథ్యంలోనే విజయ్-రష్మిక వివాహ వేడుకను స్ట్రీమింగ్ చేయడానికి ఒక ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ఏకంగా రూ. 60 కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించిందట.
అయితే, ఈ జంట తమ జీవితంలోని ఈ అపురూప ఘట్టాన్ని వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి అనేది కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య జరగాల్సిన వ్యక్తిగత వేడుక అని భావించి, ఆ కోట్లాది రూపాయల ఆఫర్ను వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. వీరి నిర్ణయం చూస్తుంటే ప్రైవసీకి వీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ నెల 26న టాలీవుడ్లో ఒక గ్రాండ్ వెడ్డింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.