సల్మాన్ఖాన్ సూపర్హిట్ హిందీ చిత్రం ‘బజరంగీ భాయిజాన్’ సినిమా గుర్తుంది కదా. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కబీర్ఖాన్ దర్శకత్వం వహించగా, 2015 రంజాన్ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాలో అనుష్కాశర్మ హీరోయిన్గా చేయగా, ఈ సినిమాలోని మన్నీ అజీజ్ అనే పాకిస్తానీ చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా (Harshali Malhotra) యాక్ట్ చేసింది. ఇప్పుడు అదే చిన్నారి హర్షాలీయే, పదేళ్ల తర్వాత అఖండ 2 (Akhanda2) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి నటిగా ఎంట్రీ ఇస్తోంది.
బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషనలో ‘అఖండ’ సినిమాకు సీక్వెల్గా ‘అఖండ 2’ రానుంది. దసరా సందర్భంగా ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలోని జనని పాత్రకు హర్షాలీ మల్హోత్రాను కన్ఫార్మ్ చేశారు మేకర్స్. ‘అఖండ’ సినిమాలో ఓ చిన్నపాప పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ‘అఖండ 2’లో ఆ పాపనే, ఇప్పటి టైమ్కి తగ్గట్లుగా టీనేజ్ అమ్మాయి రోల్ఓకి హర్షాలీని మేకర్స్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేయగా, ‘అఖండ 2’లో మాత్రం సంయుక్త హీరోయిన్గా కనిపిస్తారు. ఆదిపినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు.
‘అఖండ 2’ సినిమా సెప్టెంబరు 25న విడుదల కాదని, డిసెంబరులో రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీని, మేకర్స్ ‘అఖండ 2’ సినిమాను గురించి ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా, సెప్టెంబరు 25నే రిలీజ్ అంటూ చెబుతున్నారు. పైగా ఈ తేదీకి తగ్గట్లుగా డిస్ట్రిబ్యూషన్ పనులు కూడా మొదలైపోయాయట. మరోవైపు ఇదే రోజు పవన్కల్యాణ్ ‘ఓజీ’ సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఓ దశలో ‘ఓజీ’ సినిమా విడుదల వాయిదా పడుతుందని, ఈ ప్లేస్లో ‘విశ్వంభర’ సినిమా రావొచ్చనే టాక్ వినిపించింది. కానీ మేం ముందుగా చెప్పినట్లుగానే సెప్టెంబరు 25నే వస్తామని, రూమర్స్ను నమ్మవద్దని ‘ఓజీ’ యూనిట్ స్పందించింది. మరి..వీరిద్దరి సినిమాల్లో ఏ సినిమా రిలీజ్ వాయిదా పడుతుంది? ఎవరు వెనక్కి తగ్గుతారు? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.