Heroine Sakshi Vaidya selected for Pawan Kalyan new movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఎప్పుడో ప్రకటించిన క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో వినపడుతోంది.
దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఈ ప్రాజెక్ట్ కదలిక మొదలైంది. వక్కంతం వంశీ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని, రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో నటించే కథానాయిక విషయంలో గత కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్న ఇమాన్వీ ఈ ప్రాజెక్టులో ఎంపికైందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ‘నారీ నారీ నడుమ మురారి’తో సక్సెస్ అందుకున్న సాక్షి వైద్యను ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ సినిమాతోనే ఆమె టాలీవుడ్కు పరిచయమైంది. ఇప్పుడు తన ఆస్థాన దర్శకుడి పిలుపు మేరకు పవన్ కల్యాణ్ సరసన నటించే మెగా ఛాన్స్ కొట్టేసిందని టాక్.
అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా లేక సాక్షి ఒక్కరే మెయిన్ లీడ్గా కనిపిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సురేందర్ రెడ్డి సినిమాలంటేనే మేకింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. పవన్ కల్యాణ్ను ఆయన ఒక సరికొత్త మేకోవర్లో చూపించబోతున్నట్లు సమాచారం. వక్కంతం వంశీ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడంతో, ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.