Prabhas next movie with people media factory : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేవలం వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ ‘డార్లింగ్’ అనిపించుకుంటారని మరోసారి నిరూపితమైంది. తన సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతను ఆదుకునేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘ది రాజాసాబ్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
కథాంశం బలహీనంగా ఉండటంతో అటు సామాన్య ప్రేక్షకులు, ఇటు అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు భారీ నష్టాలు వాటిల్లినట్లు సమాచారం.
సాధారణంగా తన వల్ల ఎవరైనా నష్టపోతే బాధ్యత తీసుకునే ప్రభాస్, ఈసారి కూడా అదే పని చేశారు. ఇటీవల తనను కలిసిన నిర్మాతతో మాట్లాడుతూ.. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు అదే బ్యానర్లో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారట. హీరో స్వయంగా మరో అవకాశం ఇస్తానని చెప్పడంతో నిర్మాత హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ప్రభాస్ చేయబోయే ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు వినిపిస్తున్నాయి. ‘రాజాసాబ్’ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్టుగా, పాన్ ఇండియా రేంజ్లో అదిరిపోయే కథను సిద్ధం చేయాలని టీజీ విశ్వప్రసాద్ భావిస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్టును ఎవరు హ్యాండిల్ చేస్తారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే, ఒక అగ్ర దర్శకుడితో చర్చలు జరిపి త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలోపు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తన నిర్మాతల పట్ల ప్రభాస్ చూపిస్తున్న ఈ నిబద్ధత చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.