‘సినిమా చూపిస్తా మావా, మజ్ను, ధమాకా’ వంటి హిట్ సినిమాలను తీశారు దర్శకుడు నక్కిన త్రినాథ రావు. ఈ దర్శకుడి నిర్మాతగా మారి తొలి సారిగా ‘చౌర్యపాఠం’ అనే సినిమాను నిర్మించారు. నిజానికి ఈ మూవీ ఈ నెల 18న విడుదల కావాల్సింది. కానీ ఏప్రిల్ 25కి వాయిదా వేశారు. జనాలు థియేటర్స్కు రావకపోవడం వల్లే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని నక్కిన త్రినాథరావు అంటున్నారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నక్కిన త్రినాథరావు మాట్లాడిన విషయాలు చర్చనీయాంశమైయ్యాయి.
‘‘సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది. థియేటర్స్లో సినిమాలు చూసేందుకు జనాలు రావడం లేదు. వినోదానికి వేరే మాధ్యమాలు ఉన్నాయనో, లేక ఆడియన్స్ను ఎట్రాక్ట్ చేసేలా మనం సినిమాలు తీయ లేకపోతున్నామో తెలియదు..కానీ..ఆడియన్స్ అయితే థియేటర్స్కు రావడం లేదు. తెలంగాణలో పరిస్థితి నాకు తెలియదు. కానీ..ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏరియాల్లో నేను స్వయంగా వెళ్లి చూశాను. ఆడియన్స్ థియేటర్స్కు రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలకూ ఆడియన్స్ రావడం లేదు. కొన్నిచోట్ల సెకండ్ షోలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నక్కిన త్రినాథరావు. ఇంకా తన దర్శకత్వంలో ఇటీవల సందీప్కిషన్ హీరోగా వచ్చిన ‘మజాకా’ సినిమాకు కూడా తాము ఊహించిన దాని కంటే తక్కువ మందే థియేటర్స్కు వచ్చారని, నక్కిన త్రినాథరావు వాపోయారు.
స్టార్ హీరోల సినిమాలకే పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉంటే సినిమా రంగం భవిష్యత్లో మరిన్ని సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీకి ప్రాణమైన మీడియం రేంజ్ హీరోలు ఆడియన్స్ను ఏట్రాక్ట్ చేసే కథలను ఎంచుకోలేకపోతున్నారు. టాప్ హీరోలు రెండేళ్లకో సినిమా తీస్తున్నారు. వీరి సినిమాలొచ్చిన.. అది వారం రోజుల హడావిడిగానే మిగిలిపోతుంది. చిన్న సినిమాలు ఆల్రెడీ ఓటీటీ సంస్థల వలలో చిక్కుకు పోతున్నాయి. చిన్న సినిమాలే కాదు..ఆ మాటొకస్తే..పెద్ద స్టార్ హీరోల సినిమాల థియేట్రికల్ ఓటీటీ రిలీజ్ డేట్ను కూడా ఓటీటీ సంస్థలే నిర్ణయిస్తున్నాయి. మరోవైపు పైరసీ భూతం పట్టి భయపెడుతోంది. సల్మాన్ఖాన్ ‘సికందర్’ సినిమా ఒక రోజు ముందే ఆన్లైన్లో లీక్ అయ్యిందంటే..సినిమా ఇండస్ట్రీ రంగంలో పైరసీ భూతం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు…. ఈ సవాళ్ళను ఒక్కొక్కటిగా సినిమా ఇండస్ట్రీ సమష్ఠిగా ఎదుర్కొనకపోతే…మరింత దారుణ పరిస్థితులను ఇండస్ట్రీ ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.