Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్కు గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ దక్కడం లేదు. గతేడాది విడుదలైన ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ చిత్రాలు భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నిజానికి ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ ఖాతాలో మరో గట్టి హిట్ పడలేదు. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో, తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన ‘ఆయ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజి కె మణిపుత్ర చెప్పిన కథకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంజి కె మణిపుత్ర చెప్పిన స్క్రిప్ట్ నితిన్కే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులకు కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారట.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించి 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు సంక్రాంతి శుభాకాంక్షలు టైటిల్ అనుకుంటున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తో జతకట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలని నితిన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ‘ఆయ్’ దర్శకుడి సినిమా నితిన్ కెరీర్కు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు సైతం ఆశిస్తున్నారు.