Mokshagnya entry with Aditya 999 Max : నందమూరి వారసుడి అరంగేట్రం కోసం వేచి చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రంపై ఫిలిం నగర్ వర్గాల్లో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఒక కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ వండర్ ‘ఆదిత్య 369’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే.
ఇప్పుడు ఆ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ కథతో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేందుకు సర్వం సిద్ధమైంది. బాలయ్యకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయ విజయాన్ని అందించిన క్రిష్ జగర్లమూడి, మోక్షజ్ఞ డెబ్యూ మూవీని హ్యాండిల్ చేయబోతున్నారని సమాచారం. చారిత్రక, సామాజిక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించే క్రిష్, ఈ టైమ్ ట్రావెల్ కథను ఏ స్థాయిలో తీర్చిదిద్దుతారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని కేవలం పరిచయ చిత్రంగానే కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విజువల్స్, లోతైన భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి నిర్మించబోతున్నారట.
మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ, త్వరలోనే ఫస్ట్ లుక్ మరియు షూటింగ్ షెడ్యూల్కు సంబంధించిన అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది. నందమూరి మూడవ తరం వారసుడి ఎంట్రీ ఇలాంటి ఒక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో జరగనుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.