Rajamouli: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అనౌన్స్మెంట్ రోజే సంచలనం సృష్టించిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు జక్కన్న పనితీరుతో మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా రాజమౌళి ఒక సినిమాను పూర్తి చేయడానికి ఏళ్ల సమయం తీసుకుంటారు. కానీ ‘వారణాసి’ విషయంలో ఆయన పంథా పూర్తిగా భిన్నంగా ఉంది.
‘మర్యాద రామన్న’ తర్వాత రాజమౌళి ఇంత వేగంగా చిత్రీకరణ జరుపుతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నెల 21 నుండి జార్జియాలో ఒక కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది. సుమారు 18 రోజుల పాటు సాగే ఈ షూట్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జూన్ లేదా జూలై 2026 నాటికి షూటింగ్ మొత్తానికి గుమ్మడికాయ కొట్టేసి, జూలై నుండి పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్,VFX పనులపై దృష్టి సారించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒక ఎత్తు అయితే, ఇందులో ఉండబోయే రామాయణ సీక్వెన్స్ మరో ఎత్తు అని తెలుస్తోంది. తన సుదీర్ఘ కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన, సవాలుతో కూడుకున్న సీన్ ఇదని రాజమౌళి పేర్కొనడం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
ఈ సీక్వెన్స్ కోసం వాడుతున్న గ్రాఫిక్స్ ఇప్పటి వరకు భారతీయ వెండితెరపై ఎవరూ చూడని విధంగా ఉండబోతున్నాయట. ఈ సీన్ను పర్ఫెక్ట్గా అవుట్పుట్ తీసుకురావడానికి అంతర్జాతీయ స్థాయి నిపుణులు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబును యాక్షన్ అడ్వెంచర్ హీరోగా చూపిస్తూనే, రాజమౌళి తనదైన విజువల్ మాయాజాలంతో ప్రపంచ స్థాయి సినిమాను సిద్ధం చేస్తున్నారు.