Sai Pallavi: టాలీవుడ్లో బయోపిక్ చిత్రాల హవా కాస్త తగ్గుముఖం పట్టిన తరుణంలో, మళ్ళీ ఆ ట్రెండ్కు ఊపిరి పోస్తూ ఒక భారీ ప్రాజెక్ట్ తెరపైకి రాబోతోంది. కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, ‘భారతరత్న’ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు గీతా ఆర్ట్స్ సిద్ధమైంది. ఒకప్పుడు వెండితెరకు బయోపిక్లు కొత్త ఊపునిచ్చాయి. మహానటులు, క్రీడాకారుల జీవిత కథలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే పంథాలో, భారతీయ సంగీత శిఖరం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి వైభవాన్ని నేటి తరానికి చూపించేందుకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నడుం బిగించారు.
సంగీత ప్రియుల హృదయాల్లో సుబ్బలక్ష్మి గారు ఒక చెరగని సంతకం. భారతరత్న పురస్కారం అందుకున్న తొలి సంగీత కళాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. తలలో మల్లెపూలు, చేతిలో తంబూరతో ఆమె పాడటం మొదలుపెడితే, శ్రోతలు భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. 2004లో ఆమె భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆమె గాత్రం మాత్రం అనంతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘జెర్సీ’ వంటి ఎమోషనల్ హిట్లను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నారు.
గౌతమ్ ఇదివరకే ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ‘కింగ్డమ్’ ఆశించిన విజయం సాధించకపోయినా, ఈ బయోపిక్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని ఆయన కంకణం కట్టుకున్నారు.
ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. సుబ్బలక్ష్మి గారి పాత్రలో ఎవరు నటిస్తారు అనేది. గతంలో నిత్యా మీనన్, శ్రద్ధా కపూర్ వంటి పేర్లు వినిపించినప్పటికీ, చివరికి సాయి పల్లవి ఈ పాత్రకు ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ‘రామాయణం’లో సీతగా నటిస్తున్న సాయి పల్లవికి ఉన్న ‘నేచురల్’ ఇమేజ్, ఆమె హావభావాలు సుబ్బలక్ష్మి గారి పాత్రకు పరిపూర్ణతను ఇస్తాయని అల్లు అరవింద్ భావించినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి నటన, గౌతమ్ మేకింగ్, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలోనే ఈ మెగా ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.