టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తన గొప్ప మనసు చాటుకుంది. ఆమె కేవలం 24 ఏళ్ల వయసులోనే ఏకంగా ముగ్గురు పిల్లలకు తల్లిగా మారి, వారి బాధ్యతను స్వీకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాన్ని ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన శ్రీలీల, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను పంచుకుంది. 2019లో తన మొదటి కన్నడ చిత్రం ‘కిస్’ షూటింగ్ సమయంలో దర్శకుడితో కలిసి ఒక ఆశ్రమానికి వెళ్లినప్పుడు శ్రీలీలకు పిల్లలతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
2022లో ‘బై టూ లవ్’ చిత్రం విడుదలకు ముందే గురు, శోభిత అనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్నారు. తాజాగా మరో బిడ్డను కూడా దత్తత తీసుకుని, మొత్తం ముగ్గురు పిల్లల బాధ్యతను భుజాన వేసుకుంది. “ఆ పిల్లలు నా దగ్గరే ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వారి గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అవుతాను” అని శ్రీలీల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ పిల్లలు ఒక సురక్షితమైన సంరక్షణ కేంద్రంలో పెరుగుతున్నారు.
మరోవైపు గత ఏడాది ఏప్రిల్లో కూడా ‘మా ఇంటికి మరో చిట్టితల్లి వచ్చింది’ అంటూ ఒక చిన్నారితో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసింది. కానీ ఈ విషయాన్ని ప్రచారం చేసుకోవడం ఇష్టం లేకే ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచానని శ్రీలీల తెలిపారు. “పేరు కోసమో, గుర్తింపు కోసమో ఇది చేయలేదు. కానీ నన్ను చూసి మరికొందరు స్ఫూర్తి పొంది అనాథ పిల్లలకు అండగా నిలుస్తారనే ఆశతోనే ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టాను” అని ఆమె వివరించారు. దీంతో శ్రీలీల మంచి మనసుపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.