Victory Venkatesh escapes from remake movie: టాలీవుడ్ లో దృశ్యం సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ లో విక్టరీ వెంకటేష్ తనదైన నటనతో ‘రాంబాబు’ పాత్రకు ప్రాణం పోసి, మొదటి రెండు భాగాలను ఘనవిజయం దిశగా నడిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరీస్ ముగింపు భాగం ‘దృశ్యం 3’ విషయంలో వెంకీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘దృశ్యం 3’ తెలుగు రీమేక్ రేసు నుండి వెంకటేష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ప్రధానంగా మారుతున్న సినిమా మార్కెట్ సమీకరణాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘దృశ్యం 3’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈసారి కేవలం మలయాళానికే పరిమితం కాకుండా, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఏకకాలంలో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని వారు నిర్ణయించారు. గతంలో కంటే ఇప్పుడు మోహన్ లాల్కు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరిగింది. మలయాళ వెర్షన్ నేరుగా తెలుగులో విడుదలైన తర్వాత, మళ్లీ అదే కథను కోట్ల రూపాయల బడ్జెట్తో రీమేక్ చేయడం వ్యాపారపరంగా లాభదాయకం కాదని వెంకటేష్ భావిస్తున్నట్లు సమాచారం.
ఒకప్పుడు ఇతర భాషా చిత్రాలను రీమేక్ చేస్తే ఇక్కడ మంచి వసూళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఓటీటీలు, పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్నే చూడటానికి మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న వెంకీ, అనవసరంగా రీమేక్ చేయడం కంటే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ మలయాళ చిత్రం తెలుగులో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నప్పటికీ, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రాంబాబు పాత్రలో వెంకటేష్ను మళ్లీ చూడాలనుకున్న ప్రేక్షకులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే అని చెప్పాలి.