మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) వారి ఆధ్వర్యంలో నడుస్తోన్న కేటలిస్ట్ ప్రోగ్రామ్ దేశ విదేశాల నుంచి ఎందరో హాజరయ్యారు. యంగ్ ఎంటర్ప్రెన్యూరర్స్ని ఎంకరేజ్ చేయటానికి అందరూ ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటే వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి ఫలితం మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం, మనం ఉండే ఇతర దేశాలకు ఉపయోగపడుతుందనే విశాలమైన దృక్పథంతో ఈరోజు ఈవెంట్ను నిర్వహించారు. ఇక్కడున్న వారందరినీ నా ఆప్తులుగా భావిస్తున్నాను. ఇక్కడున్న వారందరూ నా కుటుంబ సభ్యులు. ప్రతీ ఒక్కరిలో నాపై వారికున్న అభిమానం, తెలుగు మీదున్న అభిమానం, దేశం మీదున్న అభిమానం కనిపిస్తోంది. నాకు గొప్ప స్వాగతాన్ని ఇచ్చిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అమెరికా నుంచి ఇంత మంది ఇక్కడకు వస్తారా? అని అందరూ అనుకుంటారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇంత మంది ఇక్కడకు రావటం అనేది గొప్ప విషయం. ఈ కమిటీలో ఉన్న అందరూ ఎంతో ఉత్సాహంగా ముందడుగు వేయటం ఎంతో మంది యంగ్స్టర్స్కి కొత్త శక్తిని ఇచ్చి వారు ఉన్నత శిఖరాలకు ఎదగటానికి ఉపయోగపడుతుంది. అమెరికాలో ఉన్న మనం బాగుండటం కాదు, మన తెలుగు వారందరూ బాగుండాలనే సదుద్దేశంతో ఆప్త వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం విశేషం. ఈవెంట్ను సక్సెస్ చేసిన సూపూ కోటాన్, సాగర్ లగ్గిశెట్టి, రమేష్ తూము, మధు వల్లి, చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట, విగయ్ సహా అందరికీ అభినందనలు. ఇలాంటి సభల్లో ఏం మాట్లాడాలనే దానిపై నాకు అవగాహన లేదు. అయితే ఎంటర్ప్రెన్యూమెంట్ అనేది చాలా మందిలో మనం కాలేజీలకు వెళ్లి చదవకుండానే మన మనసుల్లో అలాగే ఉండిపోయింది. నేను నో వేర్.. అనే స్థాయి నుంచి సమ్ వేర్ అనే స్థాయికి వచ్చానంటే నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ప్రతికూల పరిస్థితులను దాటి అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకుని, ఎలా ఎదుగుతూ వచ్చాననేది చెబితే చాలు.. చాలా మందిని ఆలోచింప చేస్తుందనిపించింది.