Director krish : సినిమా ఇండస్ట్రీలో ఒకరి కంటే ఎక్కువ మంది కథానాయికలు ఉన్నప్పుడు, వారి పాత్రలకు సమాన ప్రాధాన్యతనిస్తూ కథను నడపడం దర్శకులకు కత్తిమీద సాము లాంటిదే. పూర్వకాలంలో మల్టీస్టారర్ హీరోయిన్ సినిమాలు సందడి చేసినప్పటికీ, ప్రస్తుత కాలంలో హీరోయిన్ల రెమ్యునరేషన్లు, వారికున్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
అయితే, వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు క్రిష్ ఇప్పుడు అటువంటి ఒక భారీ సాహసానికి సిద్ధమవుతున్నారు. కమర్షియల్ ఫార్ములా కంటే కంటెంట్కే పెద్దపీట వేసే క్రిష్, తన సినిమాల్లో ఎప్పుడూ ఒక కొత్తదనాన్ని చూపిస్తుంటారు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కంచె’ వంటి చిత్రాలతో సామాజిక అంశాలను స్పృశిస్తూనే ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసిన ఆయన, ఇప్పుడు తన రూట్ మార్చి అడ్వెంచర్ జోనర్ లోకి అడుగుపెడుతున్నారు. ప్రకృతి ఒడిలో, అడవులు, పర్వత ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠభరితమైన ట్రెకింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది.
ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇందులో ఏకంగా ఏడుగురు హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపిస్తారట. ఒకరి పాత్రతో మరొకరికి సంబంధం లేకుండా, ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏడుగురు క్రేజీ హీరోయిన్లను ఒకే ఫ్రేమ్లో చూపిస్తూ, ఎవరినీ తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేయడం దర్శకుడికి పెద్ద సవాలే. అందుకే ప్రతి పాత్ర డిజైనింగ్ విషయంలో క్రిష్ ఎంతో లోతుగా కసరత్తు చేస్తున్నారట. గత ఏడాది అనుష్కతో తీసిన ‘ఘాటి’ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, క్రిష్ తన తదుపరి సినిమాపై మరింత శ్రద్ధ వహిస్తున్నారు. పాత తప్పులు పునరావృతం కాకుండా, తన గత సినిమాల కంటే భిన్నమైన అనుభూతిని ప్రేక్షకులకు పంచాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండబోయే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో నటించబోయే ఆ ఏడుగురు ముద్దుగుమ్మలు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.