టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో రెండు బ్లాక బస్టర్స్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన అనిల్, వచ్చే ఏడాది (2027) సంక్రాంతి బరిలో కూడా నిలవాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అయితే, ఇంత తక్కువ సమయంలో అనిల్తో జతకట్టే ఆ స్టార్ హీరో ఎవరు? అనే దానిపై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను సిద్ధం చేయాలంటే జూన్ లేదా జూలై కల్లా షూటింగ్ మొదలవ్వాలి. కానీ ప్రస్తుతం అగ్ర హీరోలందరూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ తర్వాత శ్రీకాంత్ ఓదెల, బాబీ ప్రాజెక్టులతో బిజీగా ఉండబోతున్నారు. వెంకీమామ ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్లో ఉన్నారు. ఆ సినిమా మే నెలలో విడుదల కానుంది. ఆ వెంటనే అనిల్తో సినిమా మొదలుపెట్టినా సంక్రాంతికి పూర్తి చేయడం కష్టమే. ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్.. వీరంతా రాబోయే రెండు మూడేళ్ల వరకు ఖాళీ లేనంతగా తమ షెడ్యూల్స్ను లాక్ చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో అనిల్ రావిపూడికి అందుబాటులో ఉన్న ఏకైక పవర్ఫుల్ ఆప్షన్ నందమూరి బాలకృష్ణ. బాలయ్య – గోపీచంద్ మలినేని చిత్రం ప్రారంభమైనప్పటికీ, అది సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.
ఇదే గ్యాప్లో అనిల్ రావిపూడి తన వద్ద ఉన్న పక్కా మాస్ కథను బాలయ్యకు వినిపించి ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ కేవలం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, ఏకంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్ అయితే 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ ఊచకోత ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఒకవేళ బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అనిల్ రావిపూడి తన ‘సంక్రాంతి సెంటిమెంట్’ను మరోసారి నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అని నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.