Raviteja: టాలీవుడ్ ‘మాస్ మహారాజా’ రవితేజ బాక్సాఫీస్ ప్రయాణం ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతల పాలిట పెన్నిధిలా ఉన్న ఆయనకు, ‘ధమాకా’ తర్వాత సరైన విజయం దక్కలేదు. వరుసగా ఐదు చిత్రాలు నిరాశపరచడంతో ఆయన మార్కెట్ లెక్కలు మారుతున్నాయి. అయినప్పటికీ, క్రేజ్ తగ్గని రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా, కాస్త మైథాలజీ టచ్తో రూపొందుతోంది. వరుస ప్లాపుల నేపథ్యంలో నిర్మాతలకు భారం కాకూడదని రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆయన ముందస్తు పారితోషికం తీసుకోకుండా, లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారట.’బింబిసార’, ‘విశ్వంభర’ చిత్రాల దర్శకుడు వశిష్ట మల్లిడి రవితేజ కోసం ఒక భారీ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేశారు. కథ, క్యారెక్టరైజేషన్ రవితేజకు బాగా నచ్చినప్పటికీ, బడ్జెట్ విషయంలో సందిగ్ధత నెలకొంది. సైన్స్ ఫిక్షన్ కావడంతో ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి అంత భారీ బడ్జెట్తో రిస్క్ చేయడం కరెక్ట్ కాదని రవితేజ భావిస్తున్నారట.
భారీ బడ్జెట్ కథను పక్కన పెట్టి, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్టోరీని సిద్ధం చేయమని వశిష్టకు రవితేజ సూచించినట్లు ఇండస్ట్రీ టాక్. వరుస పరాజయాల తర్వాత రవితేజ తన పంథాను మార్చుకుంటూ, బడ్జెట్ నియంత్రణతో సేఫ్ జోన్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ జాగ్రత్తలు ఆయనకు మళ్ళీ సక్సెస్ బాట పట్టిస్తాయో లేదో వేచి చూడాలి. మరోవైపు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా 2025 సంక్రాంతికే రావాలి, కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండటం కోసం (VFX పనుల నిమిత్తం) వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రం 2026 జూన్ నెలలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.