Chiranjeevi: సంక్రాంతి బ్లాక్బస్టర్ ‘మన శంకరవరప్రసాద్గారు’ అందించిన జోష్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, అస్సలు విరామం తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన బాబీ కొల్లి – చిరంజీవి (మెగా 158) కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు బాబీ మార్చి నెలలోనే ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు.
‘మన శంకరవరప్రసాద్గారు’ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమాను అనౌన్స్ చేసిన మేకర్స్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ సినిమా తండ్రి-కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. అయితే ఇందులో మెగాస్టార్ కూతురి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై కొన్నాళ్లుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత కృతిశెట్టి పేరు ప్రచారంలోకి రాగా, ఆ తర్వాత సారా అర్జున్ పేరు వినిపించింది. కానీ తాజా టాక్ ప్రకారం, ‘ఛాంపియన్’ సినిమాతో తన నటనతో మెప్పించిన మలయాళ ముద్దుగుమ్మ అనస్వరా రాజన్ ఈ మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఆమె, చిరంజీవి సినిమాలో నటించడం విశేషం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందని దర్శకుడు బాబీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఒక పాత్ర కోసం సీనియర్ స్టార్ హీరోయిన్ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. రెండో హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తండ్రిగా చిరంజీవి చేసే సందడి, బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.