Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పారితోషికం విషయంలో రూట్ మార్చారు. సాధారణంగా స్టార్ హీరోలు సినిమా షూటింగ్ మొదలవ్వకముందే కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం చూస్తుంటాం. కానీ, బన్నీ మాత్రం ‘పుష్ప-2: ది రూల్’ కోసం ఒక సరికొత్త ‘బిజినెస్ మోడల్’ను తెరపైకి తెచ్చి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. సినిమా సక్సెస్ అయితేనే కాదు, సినిమా వ్యాపారంలోనూ తాను భాగస్వామిని కావాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు.
అందుకే ‘పుష్ప-2’ కోసం ఆయన ఫిక్స్డ్ రెమ్యునరేషన్ కంటే ‘రెవెన్యూ షేరింగ్’ పద్ధతికే మొగ్గు చూపారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘పుష్ప-2’ కి జరిగిన మొత్తం బిజినెస్లో (థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు) బన్నీ దాదాపు 27% నుండి 30% వరకు వాటాను పారితోషికంగా పొందుతున్నారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.1000 కోట్లకు పైగా జరగడంతో, ఆయన ఆదాయం ఒక్క సినిమాతోనే రూ. 270 నుండి రూ.300 కోట్ల మార్కును తాకినట్లు తెలుస్తోంది.
భారతీయ సినీ చరిత్రలో ఒక హీరో అందుకున్న అత్యధిక పారితోషికాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. ‘పుష్ప-2’ తో వర్కవుట్ అయిన ఈ ఫార్ములాను బన్నీ తన తదుపరి చిత్రాలకు కూడా వర్తింపజేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం (AA22) కోసం ఆయన డీల్ కుదుర్చుకున్నారు.
ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 800 కోట్లు కాగా, బన్నీకి రూ. 175 కోట్ల ఫిక్స్డ్ రెమ్యునరేషన్ దక్కనుంది. దీనికి తోడు అదనంగా 15 శాతం లాభాల్లో వాటా ఇచ్చేలా అగ్రిమెంట్ కుదిరిందట. ఫలితంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే బన్నీ ఖాతాలో రూ. 300 కోట్లకు పైగా చేరడం ఖాయం.
అట్లీ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (AA23) ప్రాజెక్ట్ విషయంలోనూ మైత్రీ మూవీ మేకర్స్ ఇదే తరహా భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు సమాచారం. సినిమా రిస్క్లోనూ, సక్సెస్లోనూ భాగస్వామిగా మారుతూ అల్లు అర్జున్ అనుసరిస్తున్న ఈ ‘బిజినెస్ షేరింగ్’ మోడల్ ఇప్పుడు ఇతర అగ్ర హీరోలను సైతం ఆలోచనలో పడేస్తోంది. అల్లు అర్జున్ కేవలం నటుడిగానే కాకుండా, ఒక స్మార్ట్ బిజినెస్ మ్యాన్గా మారుతూ టాలీవుడ్ రెమ్యునరేషన్ లెక్కలను తిరగరాస్తున్నారు.