‘ది ఇండియా హౌస్’ (TheindiaHouse Movie) సినిమా సెట్స్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది (Nikhil TheindiaHouse Movie Accident). నిఖిల్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్ కాగా, అనుపమ్ఖేర్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. వి క్రియేషన్స్ (రామ్చరణ్, యూవీ క్రియేషన్స్ విక్రమ్ కలిసి…ఈ వి క్రియేషన్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్వంశీక్రిష్ణ ఈ సినిమాకు దర్శకుడు. రెండు సంవత్సరాల క్రితమే ఈ సినిమాను ప్రకటించారు. షూటింగ్ కూడా అప్పుడే మొదలైంది. కానీ నిఖిల్ మరో చారిత్రాక చిత్రం ‘స్వయంభు’తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ బిజీగా సాగలేదు. ఇటీవల ‘స్వయంభూ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో, ‘ది ఇండియాహౌస్’ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు.
ఈ సినిమా కోసం హైదరాబాద్లోని శంషాబాద్ ఏరియాలో భారీ సెట్ వేశారు. ప్రజెంట్ సముద్రం నేపథ్యంతో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ వాటర్ ట్యాంకు వినియోగిస్తున్నారు. కానీ హఠాత్తుగా ఈ వాటర్ ట్యాంక్ పేలడంతో, సెట్స్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అసిస్టెంట్ కెమెరామేన్తో పాటుగా, మరో వ్యక్తికి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయని తెలిసింది. వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సెట్స్లో నిఖిల్ ఉన్నారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదం కారణంగా మూవీ యూనిట్కు చెందిన సామాగ్రి పనికిరాకుండ పోయింది. అలాగే తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.