ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ అధినేత డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వర్గీయ నంద కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ‘శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం’ పేరుతో మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల భారీ వ్యయంతో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూసిన నంద్ కిషోర్ గోయెంకా అంత్యక్రియలు హిస్సార్లోని అగ్రోహా ధామ్లో ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన తండ్రి పేరు, ఆయన ఆశయాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా డాక్టర్ సుభాష్ చంద్ర ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
యూనివర్సిటీ ముఖ్య విశేషాలు.
సామాజిక సేవపై ప్రత్యేక కోర్సు: నంద కిషోర్ గోయెంకా వారసత్వాన్ని, మానవీయ విలువలను రాబోయే తరాలకు అందించేలా ఈ విశ్వవిద్యాలయంలో “సామాజిక సేవ మరియు దాతృత్వం” (Social Service and Philanthropy)పై ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నారు.
పేద విద్యార్థులకు ప్రాధాన్యత: ఆర్థికంగా వెనుకబడిన, పేద విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో తగిన స్థానం, ప్రాధాన్యత ఉంటుందని డాక్టర్ సుభాష్ చంద్ర స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది నుంచే ప్రారంభం: ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది నుంచే యూనివర్సిటీ విద్యా కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సమాజ సేవకే అంకితమైన జీవితం
1930 సెప్టెంబర్ 28న జన్మించిన నంద కిషోర్ గోయెంకా క్రమశిక్షణ, మానవీయ విలువలకు మారుపేరుగా నిలిచారు. వ్యాపార కుటుంబంలో జన్మించినప్పటికీ, వాణిజ్య వ్యాపారాలకు దూరంగా ఉంటూ.. జీవితాంతం సనాతన ధర్మ పరిరక్షణకు, సామాజిక సేవకే అంకితమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సుదీర్ఘకాలం పాటు ఆయన సేవలు అందించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈ విద్యాసంస్థను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నట్లు ఎస్సెల్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.