Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’, ఇప్పుడు డిజిటల్ మార్కెట్లోనూ ఊహించని రికార్డులను సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం, తన సీక్వెల్తో బిజినెస్ పరంగా సరికొత్త చరిత్రను లిఖించింది. తాజా సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ ఓటీటీ హక్కులు తొలి భాగం కంటే దాదాపు రెట్టింపు ధరకు అమ్ముడైనట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
తొలి భాగానికి వచ్చిన క్రేజ్ దృష్ట్యా, సీక్వెల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రేసులో జియో హాట్స్టార్ ముందంజలో నిలిచింది. ధురంధర్ పార్ట్-1 ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ రూ.80 కోట్లకు కొనుక్కుంటే.. ఇప్పడు
ధురంధర్ 2 ఓటీటీ రైట్స్ ను జియో హాట్స్టార్ ఏకంగా రూ.150 కోట్లకు దక్కించుకోవడం గమనార్హం. ఈ మూవీ ఓటీటీ మార్కెట్ విలువ ఉన్నటుండి డబుల్ అవ్వడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫ్రాంచైజీ సినిమాలు ఒకే ప్లాట్ఫామ్పై ఉండాలని ఓటీటీలు కోరుకుంటాయి, కానీ జియో హాట్స్టార్ ఇచ్చిన రూ.150 కోట్ల భారీ ఆఫర్ను కాదనలేక మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ‘ధురంధర్’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీ లోనూ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే గ్లోబల్ స్థాయిలో టాప్ వ్యూయర్షిప్ సాధించింది. ఇందులో రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణం తోడవడంతో సినిమా రేంజ్ పెరిగింది. ‘ఉరి’ తర్వాత ఆదిత్య ధర్ తన టేకింగ్తో మరోసారి ప్రేక్షకులను మెప్పించడంతో, సీక్వెల్పై భారీ నమ్మకం ఏర్పడింది. తొలి భాగం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉండగా, రెండో భాగాన్ని జియో హాట్స్టార్ దక్కించుకోవడం విశేషం. కాగా మార్చి 19న థియేటర్లలో విడుదల కానున్న ‘ధురంధర్ 2’ ఇలా డిజిటల్ రైట్స్ ద్వారానే నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. మరి రేపు థియేటర్స్ ఈ మూవీ ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.