Allu Arjun new film: బాలీవుడ్లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ఇటీవలి సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ఆదిత్య ధర్ ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ సినిమా చూసిన బన్నీ, సోషల్ మీడియా వేదికగా ఆదిత్య ధర్ టేకింగ్ను, రణవీర్ సింగ్ నటనను ప్రశంసలతో ముంచెత్తారు. ఆదిత్యను “ఏస్ ఫిల్మ్ మేకర్” అని సంబోధించడంతో, వీరిద్దరి మధ్య ఏదో పెద్ద ప్లాన్ నడుస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు. గతంలో ఆదిత్య ధర్ ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే భారీ పౌరాణిక యాక్షన్ సినిమాను రూపొందించాలని భావించారు. మొదట విక్కీ కౌశల్తో అనుకున్న ఈ ప్రాజెక్ట్, ఆ తర్వాత అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. అయితే, ప్రభాస్ ‘కల్కి 2898 AD’లో అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్ అద్భుతంగా పండించడంతో, అచ్చం అదే నేపథ్యంలో మరో సినిమా చేయడం రిస్క్ అని భావించి ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిత్య ధర్ ‘ధురంధర్ 2’ పనుల్లో బిజీగా ఉండగా, అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రాల కోసం (లోకేష్ కనగరాజ్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్) సిద్ధమవుతున్నారు.
అయితే, ‘ధురంధర్’ వంటి గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్ను ఆదిత్య తెరకెక్కించిన తీరు నచ్చడంతో, బన్నీ కోసం ఒక ఫ్రెష్ యాక్షన్ స్క్రిప్ట్ను ఆదిత్య సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆదిత్య ధర్ సినిమాలు సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంటాయి. బన్నీ లాంటి స్టార్ తోడైతే అది అంతర్జాతీయ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఈ కాంబో గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇద్దరి మధ్య కథా చర్చలు మాత్రం జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ప్రాజెక్ట్ ఓకే అయితే, ఇది 2027 నాటికి పట్టాలెక్కే అవకాశం ఉంది. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్-ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్కు చేరుకుంది. ఇలాంటి తరుణంలో ఆదిత్య ధర్ లాంటి విజనరీ దర్శకుడితో సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం.