టాలీవుడ్ లో తన తొలి చిత్రం ‘దసరా’తోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఒక పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామాలో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సుకుమార్ శిష్యుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న శ్రీకాంత్ ఫస్ట్ మూవీలోనే రా అండ్ రస్టిక్ మేకింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమానే మెగాస్టార్ తో చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుపై ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.
ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇటీవలే కథా నేపథ్యంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ 1970ల నేపథ్యంలో సాగనుంది. ముఖ్యంగా 1974-75 కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారట. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో విడుదల చేసిన పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. చేతులు రక్తంతో తడిసిన ఫోటోలను బట్టి చూస్తుంటే, చిరంజీవి ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఊరమాస్, వయలెంట్ పాత్రలో కనిపించబోతున్నారని అర్థమవుతోంది. తన సినిమాల్లో సహజత్వానికి పెద్దపీట వేసే శ్రీకాంత్, 70ల నాటి పరిస్థితులను, అప్పటి సామాజిక అంశాలను రక్తపాతం, యాక్షన్ కలగలిపి చూపించబోతున్నారు.
వరుసగా పీరియడిక్ చిత్రాలనే ఎంచుకుంటున్న శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి కోసం ఒక భారీ ప్లాన్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం నానితో ‘ది పారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్న శ్రీకాంత్, ఆ వెంటనే ఈ మెగా ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఓ సీనియర్ హీరోను ఇంతటి రస్టిక్ రోల్లో చూడటం అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవి మాస్ ఇమేజ్ను శ్రీకాంత్ ఓదెల ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ రక్తసిక్తమైన గాథ వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!