Director AnilRavipudi: టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Director AnilRavipudi news) పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయాన్ని అందు కోవడంతో, అనిల్ క్రేజ్ ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరుకుంది. అపజయం అనేదే తెలియని ఈ ‘సక్సెస్ ఫుల్’ డైరెక్టర్, ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత ఖరీదైన దర్శకుడిగా మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమాతో కలిపి వరుసగా 9వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో ఆయనకున్న నేర్పు, నిర్మాతలకు ఆయన్ని ఒక ‘మినిమం గ్యారెంటీ’ దర్శకుడిగా మార్చేసింది. చిరంజీవిని మళ్ళీ వింటేజ్ లుక్ లో కామెడీతో ప్రెజెంట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అనిల్ రావిపూడి తాజా సక్సెస్ను చూసి టాలీవుడ్లోని సుమారు నాలుగు అగ్ర నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. అనిల్ రావిపూడి ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికంతో పాటు, లాభాల్లో కూడా వాటా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని ఫిలిం నగర్ సమాచారం.
ఒకవేళ ఈ వార్త నిజమైతే, పారితోషికం విషయంలో దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత స్థానాన్ని అనిల్ రావిపూడి కైవసం చేసుకునే అవకాశం ఉంది. సుకుమార్, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ల సరసన ఇప్పుడు అనిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలంటే నిర్మాతలకు ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. కానీ అనిల్ రావిపూడి విషయంలో ఆ భయం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. వినోదం, యాక్షన్, ఎమోషన్స్ కలిపి పక్కాగా సినిమాను మలచడంలో ఆయనది ప్రత్యేక శైలి. సినిమా ఫలితం ఏదైనా, కనీస వసూళ్లను రాబట్టగలడనే నమ్మకం అనిల్పై నిర్మాతలకు రెట్టింపు అయ్యింది. అందుకే ఆయన అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు వెనుకాడటం లేదు.