Hiranyakashyap Movie: ‘హిరణ్యకశ్యప’ సినిమా (Hiranyakashyap Movie) ఇక లేదని తేల్చేశారు దర్శకుడు గుణశేఖర్. ‘ఒక్కడు’, ‘రుద్రమదేవి’, ‘చూడాలని వుంది!’ వంటి సూపర్హిట్ సినిమాలను తీశారు గుణశేఖర్. 2019లో తన బర్త్ డేకి ఒక రోజు ముందు.. అంటే జూన్ 1న హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించారు గుణశేఖర్. ఈ సినిమాలో రానా హీరోగా నటిం చాల్సింది. అప్పట్నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి.
మధ్యలో ఏమైందో ఏమో కానీ..కామిక్ కాన్ వేదికగా, 2023లో రానా హీరోగా ‘హిరణ్యకశ్యప’ సినిమా ప్రకటన వచ్చింది. కానీ ఇందులో దర్శకుడిగా గుణశేఖర్ పేరు లేదు. పైగా రచనా సహకారం అంటూ త్రివిక్రమ్ పేరు వచ్చింది. అలాగే, ఈ సినిమాను రానా సొంత నిర్మాణసంస్థ, ఈ సినిమాను నిర్మించ నుందనే ప్రకటన ఉంది. అప్పట్లో ఇది కాస్త వివాదమే అయ్యింది. తాజాగా ఈ విషయంపై గుణశేఖర్ స్పందించారు.
‘హిరణ్యకశ్యప’ సినిమా కోసం తాను ఏడెనిమిదేళ్లు సమయం కేటాయించానని, ఫాక్స్ మీడియా సంస్థ రూ.300 కోట్ల రూపాయాలతో, ఈ సినిమాను నిర్మించతలపెట్టిందని ఆయన అన్నారు. కానీ…డిస్నీ సంస్థలో ఫాక్స్ సంస్థ విలీనం అయిన తర్వాత, వారు భారీ బడ్జెట్ పెట్టి, హిరణ్యకశ్యప సినిమాను నా డైరెక్షన్లో తీసేందుకు ఆసక్తి చూపించలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ‘హిరణ్యకశ్యప’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి పొటెన్షియల్ ఉందని, ముందు తానే గ్రహించానని, కాకపోతే, ఆ చిత్రంతీయలేకపోయనని గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే యానిమేషన్ వెర్షన్లో తీసిన, ‘మహావతార్ నరసింహా’ సినిమా 600 కోట్ల రూపాయాలను కొల్లగొట్టిందని, ఒకవేళ తాను లైవ్యాక్షన్తో ఈ సినిమాను తీసి ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి అన్న ఊహాగానాలు వ్యక్తం చేశారు. ఇక తన డైరెక్షన్లో వచ్చిన గత చిత్రం ‘యుఫోరియా’కు థియేట్రికల్గా మంచి స్పందన లేకపోయినప్పటికీని, ఓటీటీలో మాత్రం బ్లాక్బస్టర్గా నిలిచిందని గుణశేఖర్ తెలిపారు.
ప్రస్తుతం తన దగ్గర మరో భారీ పీరియాడికల్ సినిమా ఉందని, నిర్మాతలు వస్తే, నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన పేర్కొన్నారు.