Spirit: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై నెలకొన్న గందరగోళానికి నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో ఫుల్స్టాప్ పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. ఇటీవల విడుదలైన ఆడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అందులో ప్రకాష్ రాజ్, ప్రభాస్ మధ్య సాగే సంభాషణలు సినిమా థీమ్ను పరిచయం చేశాయి. గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దర్శకుడు సందీప్ వంగాతో తలెత్తిన విభేదాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రకరకాల కథనాలు వెలువడ్డాయి.
ఈ రూమర్లపై ప్రకాష్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణే ఇంకా ప్రారంభం కాలేదని ఆయన వెల్లడించారు. “స్పిరిట్ గురించి విషపూరిత ప్రచారం చేస్తున్న వారందరికీ ఒకటే చెప్పదలచుకున్నాను.. ఇంకా నా సీన్స్ షూటింగే మొదలవ్వలేదు, అప్పుడే వాట్సాప్ ఫ్యాక్టరీలో కట్టుకథలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్రలేచి మీ పని మీరు చూసుకోండి” అంటూ నవ్వుతున్న ఎమోజీలతో చురకలు అంటించారు. దీంతో ఆయన ఈ సినిమాలో కొనసాగుతున్నారనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చేసింది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో వివేక్ ఒబెరాయ్, తృప్తి డిమ్రి, కాంచన వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. 2027, మార్చి 5న స్పిరిట్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.