Balakrishna new film: టాలీవుడ్లో సీనియర్ హీరోల హవా గట్టిగా నడుస్తోంది. వరుస విజయాలతో జోష్ మీదున్న అగ్ర కథానాయకులు, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇదే వేగంతో నందమూరి బాలకృష్ణ కూడా తన తదుపరి చిత్రాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య తన ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఈ సినిమా సెట్స్పై ఉండగానే బాలకృష్ణ మరో ఆసక్తికరమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం, ‘దండుపాళ్యం’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు శ్రీనివాసరాజు, ఇటీవల బాలయ్యను కలిసి ఒక వైవిధ్యమైన స్క్రిప్ట్ను వివరించారు. శ్రీనివాసరాజు శైలి ఎప్పుడూ కాస్త భిన్నంగా, రా అండ్ రస్టిక్గా ఉంటుంది. ఆయన చెప్పిన పాయింట్ బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని సినిమాతో పాటే సమాంతరంగా మరో సినిమాను కూడా షూటింగ్ చేసే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారట.
కథ నచ్చినప్పటికీ, బాలయ్య ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరికొన్ని కథలు విన్న తర్వాతే ఏ దర్శకుడితో ముందుకు వెళ్లాలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఒకవేళ శ్రీనివాసరాజుతో సినిమా ఖాయమైతే, బాలయ్య వెండితెరపై సరికొత్త మేకోవర్లో కనిపించడం ఖాయం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నప్పటికీ, నందమూరి అభిమానుల్లో మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.